రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! ముగ్గురు విద్యార్థులు మృతి.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ కారు లారీ కిందకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే, గండిపేట మండలం ఖానాపూర్ వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ కారులో ఐదుగురు విద్యార్థులు ప్రయాణిస్తుండగా.. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.