నిమ్స్ లో అయిదు రోజులు మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
నిమ్స్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ప్రీతి ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచిందని వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని స్వగ్రామం గిర్నితండాకు ఆమె మృతదేహాన్ని తరలించారు. ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు.
కాగా, ప్రీతి మృతిపై తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రీతి మృతి పై స్పందిస్తూ ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు. నిందితులు ఎవరైనా.. ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.
మరో వైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారని వెల్లడించారు.