హయత్ నగర్ కిడ్నాప్ డ్రామా.. బాలిక ఆడిన నాటకం
హయత్ నగర్ లో కలకలం సృష్టించిన ఓ బాలిక కిడ్నాప్ ఘటనలో అసలు విషయం బయటపడింది. ఆమె చెప్పిన కథ అంతా బూటకమని తేలింది.
పెద్ద అంబర్ పేట్లో నివసించే ఓ బాలిక మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు యువకులు అడ్రస్ తెలుసుకునే నెపంతో బాలికను కిడ్నాప్ చేసి బైక్ మీద ఔటర్ రింగు రోడ్డు దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆ బాలిక పేర్కొంది. వారిని ప్రతిఘటించి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వస్తున్నపుడు ఓ హిజ్రా కనపడడంతో ఆమె సాయంతో బయటపడ్డానని.. ఆ హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చి తనను కాపాడిందని బాలిక చెప్పుకొచ్చింది.
హిజ్రా ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పిగించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో పోలీసులు విచారణ చేస్తూ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనను రీక్రియేట్ చేయగా.. అసలు విషయం బయటపడింది. బాలిక చెప్తున్నది అబద్ధం అని తేలింది.
అసలేం జరిగిందంటే కిడ్నాప్ కు గురయ్యానని చెబుతున్న బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్చాట్ లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. స్నాప్ చాట్లో ఇద్దరూ ఫొటోలు పంపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడంతో ఆ పరిచయం ఇంకా బలపడింది. ఇద్దరూ బయట కలుసు కోవాలనుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో బాలిక ఒంటరిగా బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకడు బైక్ మీద వచ్చాడు. బాలిక అతనితో కలిసి శివార్లకు వెళ్లింది.
అయితే వాళ్లిద్దరు ఉన్న సమయంలో ఓ హిజ్రా అటు వైపుగా వచ్చింది. ఇది గమనించిన వాళ్లిద్దరు కంగారు పడ్డారు. బాలిక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆమె కాలికి గాయమైంది. దీంతో భయపడిపోయిన బాలిక హిజ్రా దగ్గరకు వెళ్ళి తనను కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని చెప్పి తనను కాపాడామని ప్రాధేయపడింది. బాలిక మాటలు విన్న హిజ్రా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం పోలిసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ క్రమంలో విచారణ జరిపిన పోలీసులు ఆ రాత్రి జరిగిన ఘటనను కూడా రీక్రియేట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. బాలిక చెప్పినదంతా బూటకమని తేలింది.