ట్రైన్ లో ప్రయాణం అంటే నుంచో వలసి వస్తుందేమో.. అని అందరూ వారం రోజుల ముందే టికెట్లను బుక్ చేసుకుంటారు. అందులోనూ సౌకర్యంగా ప్రయాణించడం కోసం లోవర్ బెర్త్ , సైడ్ బెర్తలను బుక్ చేయడానికి పోటీ పడుతుంటారు. కానీ ఇక నుంచి అలా కావాల్సిన సీట్ను బుక్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే శాఖ కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
భారతీయ రైల్వే శాఖ కొన్ని సీట్లను ఇక నుంచి కొందరి కోసం రిజర్వ్ చేస్తున్నటుగా తెలిపింది. రైల్వే శాఖ ఆదేశాల ప్రకారం స్లీపర్ క్లాస్లోని నాలుగు సీట్లు, దిగువన 2 సీట్లు మధ్య 2 సీట్లు, థర్డ్ ఏసీలో రెండు సీట్లు, ఏసీ ఎకానమీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయని తెలుస్తుంది. అతను గానీ, లేదా అతనితో పాటు ప్రయాణించే వ్యక్తులు ఎవరైనా గానీ ఈ సీటులో కూర్చోవచ్చు.
గరీబ్ రథ్ రైలులో దిగువ రెండు సీట్లు, పై 2 సీట్లు వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. అయితే ఈ సీట్ల కోసం వారు పూర్తి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కోసం లోవర్ బెర్త్ లను రైల్వే శాఖ రిజర్వ్ చేస్తున్నట్టుగా తెలిపింది. ఇక నుంచి స్లీపర్ క్లాస్ లో 6-7 లోవర్ బెర్తులు, ప్రతి థర్డ్ ఏసీ కౌచ్ లో 4-5 లోవర్ బెర్తులు, సెకండ్ ఏసీ కౌచ్ లో 3-4 లోవర్ బెర్తులను 45 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజెన్లకు లేదా గర్భిణీ స్త్రీలకు రిజర్వ్ చేసినట్టుగా భారతీయ రైల్వే తెలిపింది. వారు ఎటువంటి ఆప్షన్ను ఎంచుకోకుండానే ఈ సీట్లను పొందే సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పిస్తుంది.
అయితే ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కానీ, గర్భిణీ స్త్రీలు కానీ అప్పర్ బెర్త్ పొందినటైతే.. టిటి టికెట్లను పరిశీలించేటప్పుడు వారికి లోవర్ బెర్త్ ను కేటాయించే విధంగా చూడాలని రైల్వే శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.