పదమూడేళ్ళకే ఎవరెస్ట్ అధిరోహించింది..!
నాలుగు అంతస్తుల భవనం పైకి నడిచి ఎక్కాలంటే నే బాబోయ్ అనుకుంటారు , అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం 8848.86 m ల ఎవరెస్టును అవలీలగా ఎక్కేస్తున్నారు నేటి నారీమణులు.
పర్వతారోహణ అంటేనే ఎంతో కఠోర శ్రమ క్రమశిక్షణ ఉంటుంది. విరిగిపడే కొండచరియలు తప్పించుకోవాలి, ఏమాత్రం ఏమరపాటు వచ్చినా మన కోసం పొంచి చూసే లోయలు, అడుగడుగునా అగాధాలు, కళ్ళముందే మరణాలు .. అన్నింటినీ అధిగమించి దీక్షతో థీశాలిగా ప్రాణాలను పణంగా పెట్టి మన మువ్వన్నెల జెండాను ఎగుర వేసింది బచేంద్రిపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ.
ఉత్తరాఖండ్కు చెందిన మహిళ , 1984లో ఎవరెస్ట్ను అధిరోహించి, మన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసింది.ఈమె స్పూర్తితో అరుణిమా సిన్హా, మాలావత్ పూర్ణ, పియాలి బసక్.. మెుదలగు ఆడవారు ఎవరెస్టును అధిరోహించి మన దేశానికి గర్వ కారణం అయ్యారు.
మన తెలుగు తేజం అయిన మలావత్ పూర్ణ పదమూడేళ్ళ వయసులో ఎవరెస్ట్ అధిరోహించి, అతి చిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించిన అమ్మాయిగా పేరుతెచ్చుకుంది. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో ఏడు పర్వతారోహణ కూడా చేసింది.
తను మధ్యతరగతి కుటుంబం నుండి రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఆడపిల్లల చదువు ఆగిపోకూడదు అని ‘ప్రాజెక్ట్ శక్తి’ ని ప్రారంభించింది. ఆమెకు చేయూతగా కావ్య రెడ్డి అనే మరో మహిళ కూడా తోడైంది. కావ్య గారు ఆస్ట్రోనాట్ ట్రైనర్ గా చేస్తున్నారు. ఆడపిల్లల చదువు ఆర్థిక కారణాల వల్ల ఆగిపోకూడదన్న వారి గొప్ప లక్ష్యాన్ని, వారు ఏ ఆటంకం కలగకుండా సాధించాలని ఆశిద్దాం.