ఏపీ లో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు అయింది. గుంటూరు-1 మంగళగిరి రోడ్డు ఏఎస్ ఫంక్షన్ హాల్ పక్కన ఏపీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఈ నెల 21వ తేదీన ఉదయం 11.35 గంటలకు ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏపీ ప్రజలు బీఆర్ఎస్ ను చాలా బాగా ఆదరిస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్టుగా చెప్పారు. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో బరిలో దిగనున్నట్టుగా తెలిపారు. తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. దేశంలో బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలను సృష్టిస్తోందని తోటా చంద్రశేఖర్ ఆరోపించారు.