క్యాన్సర్ తో ఓ వ్యక్తి మరణించాడు. అతన్ని ఆఖరి చూపు చూడడానికి స్నేహితులు, బంధువులు అందరూ వచ్చారు. అతను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. కానీ చనిపోయిన ఆ వ్యక్తి లేచాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఈ వింత సంఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో జరిగింది.
విషయం ఏంటంటే రూర్కీలోని ఝబ్రెడా పట్టణానికి చెందిన 58 ఏళ్ల దీపక్ కుమార్ కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నాడు. అయితే ఉన్నట్టుండి దీపక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఆసుపత్రికి చేరుకునే లోపే అతను మరణించాడు.
స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిన దీపక్ ను చూస్తూ కన్నీరు మున్నిరయ్యారు. మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకువెళ్లడానికి అన్ని సిద్దం చేశారు. అయితే మృతదేహానికి అంతిమ స్నానం చేయిస్తుండగా దీపక్ లేచాడు. తనకేమయిందంటూ ప్రశ్నించాడు. దీంతో మరి కొంత మంది స్పృహ తప్పి పడిపోగా.. కొంత మంది ఆశ్చర్యపోయారు.
అయితే దీపక్ మళ్ళీ పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ అప్పటికి దీపక్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని మళ్ళీ గ్రామానికి రావడంతో గ్రామస్తులందరూ తరలివచ్చారు.