కల్యాణ వేదికలో వరుడ్ని చూసి పెళ్లి వద్దే వద్దన్న వధువు
ఓ వధువు కల్యాణ వేదికలో వరుడ్ని చూసి పెళ్లికి నిరాకరించింది. తనకు పెళ్ళి ససేమిరా వద్దని మొండికేసింది.
వివరాల్లోకి వెళ్తే బిహార్ రాష్ట్రం బాగల్ పూర్లోని కహల్గావ్ ప్రాంతానికి చెందిన కిట్టూ కుమారికి ఓ వ్యక్తితో పెళ్ళి కుదిరింది. ఈ పెళ్లి చూడడానికి బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ వచ్చారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. మండపం అంతా పెళ్లి సందడితో వెలిగిపోతుంది.
ఐతే ఊరేగింపుగా వివాహ వేదికపైకి వచ్చిన వరుడ్ని చూసిన వధువు కిట్టూ కుమారి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇక కాసేపట్లో ఆమె మెడలో మూడుముళ్లు పడతాయనగా.. తను ఈ పెళ్లి చేసుకోనని పెళ్లికి నిరాకరించింది. వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి పెళ్ళికి మొండికేసింది.
దీంతో పెళ్ళికి వచ్చిన వారంతా షాక్ తిన్నారు. వరుడి కుటుంబసభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు పలు హామీలు ఇచ్చారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని వధువు మరింత మొండిగా ప్రవర్తించింది. ఇక చేసేదేమీ లేక చివరికి వివాహాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.