అల్లూరి సినిమాలో “శ్రీ శ్రీ” త(ఒ)ప్పు
మన్యం వీరుడు “అల్లూరి సీతారామరాజు” తాలూకు పోరాట పటిమను అద్భుతంగా దృశ్యబద్దం చేసిన సినిమా అల్లూరి సీతారామరాజు. నటశేఖర కృష్ణ కథానాయకుడుగా నటించిన ఈ సినిమా విజయం వెనుక ఆ చిత్రంలో శ్రీ శ్రీ రాసిన “తెలుగు వీర లేవరా” పాట కూడా ఉంది. ఈ పాటలోని విప్లవాత్మక పదబంధాలు నటుడు కృష్ణలోని నటనకు ఎంతో ఉద్దీపన గా నిలిచాయి.
ఈ పాట ద్వారానే విప్లవ యోధుడు అల్లూరి చరిత్ర ప్రజలకు బాగా తెలిసింది. ఈ గేయంలో “ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగుల గొట్టి సింహాలై గర్జించాలి” అనే పదబంధాలు శ్రోతలకు చైతన్య స్ఫూర్తిని కలిగిస్తాయి. అయితే…ఈ పాటలో ఓ చోట తప్పు దొర్లిందని శ్రీశ్రీ అన్నారట.అదేమిటంటే..
మనిషి ఏకవచనం కాబట్టి సింహంలా గర్జించాలని నేను రాశాను. పాట రికార్డులో మాత్రం “సింహాలై” అని బహువచనంలో రికార్డు అయింది” అన్నారట. ఆ తర్వాత ఆ తప్పును ఆయన మరో విధంగా సరిదిద్దుతూ “ప్రతి మనిషి సింహాల సమూహంలా పోరాడాలని చెప్పడంలో తప్పు లేదు కదా అని సమర్ధించారట.
దీనిని బట్టి తప్పును ఒప్పు గా మెప్పించగల కవి శ్రీశ్రీ అనడం తప్పు కాదేమో. అంతేకాదు ఈ తెలుగు పాటకు తొలిసారిగా జాతీయ పురస్కారం రావడం విశేషం. అది కవి శ్రీశ్రీ కి, ఆంధ్రుడైన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరికి,ఆ చిత్రనిర్మాతకు దక్కిన అరుదైన జా’తీయ’ని గౌరవంగా చెప్పుకోవచ్చు.