ప్రియురాలిని చంపి తనే పోలీసులకు పిర్యాదు చేసిన పూజారి!
సాయి కృష్ణ అనే వ్యక్తి తన ప్రియురాలు కనపడడం లేదని పోలీస్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అతని కంప్లైంట్ తో ఆమెను కనిపెట్టడానికి రంగంలోకి దిగిన పోలీసులు హంతకుడు సాయి కృష్ణే అని తెలుసుకొని కంగుతిన్నారు.
వివరాల్లోకి వెళ్తే హైదరబాద్ లో బంగారు మైసమ్మ గుడిలో పూజారిగా వ్యవహరిస్తున్న సాయి కృష్ణ అనే వ్యక్తి, కురుగంటి అప్సర అనే అమ్మాయితో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. సాయి కృష్ణకు మునుపే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్సరకు ఈ విషయం తెలిసి కూడా సాయి కృష్ణతో సంబంధం కొనసాగించింది.
అయితే వీరి సంబంధం మరింత బలపడడంతో అప్సర తనను పెళ్లి చేసుకోమని సాయి కృష్ణను అడగడం మొదలు పెట్టింది. మొదట్లో సద్ది చెబుతూ వచ్చిన సాయి కృష్ణ అప్సర పెళ్ళి గురించి పదే పదే అడుగుతుండడంతో ఎలాగైన ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను శంషాబాద్ తీసుకెళ్లి, అక్కడ ఆమెను బండరాయితో మోది చంపాడు. ఆ తరువాత సరూర్నగర్లోని ఓ మ్యాన్హోల్లో ఆమె మృతదేహాన్ని పడేశాడు. అనుమానం రాకుండా ఉండడానికి అతనే పోలీస్టేషన్ కు వెళ్లి అప్సర కనపడడం లేదని పిర్యాదు చేశాడు.
సాయి కృష్ణ పిర్యాదు మేరకు ఆమెను కనిపెట్టడానికి రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల నుంచి విచారణ చేశారు. చివరికి ఓ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సాయి కృష్ణే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.