అమరావతి:వైసీపీ మంత్రి రోజాకి, జనసేన నేత నాగబాబుకుకి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది. పర్యాటక శాక మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని రోజాను నాగబాబు విమర్శించగా, నోటికి ఎంత వస్తే అంత వాగకూడదంటూ రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే జనసేన నేత నాగబాబు, మంత్రి రోజాను విమర్శిస్తూ ఇటీవలే సోషల్ మీడియాలో ఒక విడియోను పోస్ట్ చేశారు. “దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలలో ఉంది. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు..అభివృద్ధి చేయడమని మంత్రి తెలుసుకోవాలి” అంటూ విమర్శించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై రోజా చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించిన ఆయన “మీరు ఇన్ని రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం. మీ నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా ఏమీ లేదు..” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
మరో పక్క నాగబాబు చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనకు సమాధానం ఇచ్చారు రోజా. విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలని, నోటికి ఎంత వస్తే అంత వాగడం వాగకూడదని అన్నారు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం జనసేనా నాయకులకే చెందుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ గురించి వాళ్ళకి ఉన్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు అంటూ విమర్శించారు.