‘నా భర్త ప్రాణాలకు హాని ఉంది.’ – ఈటెల జమున
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను చంపడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన సతీమని జమున ఆరోపించారు. కౌశిక్ రెడ్డి రూ.20 కోట్లు ఇచ్చి తన భర్తను చంపిస్తానని అన్నట్లు తెలిసిందని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటెల జమున మాట్లాడారు.
“ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోము. కౌశిక్ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని మాకు తెలుసు. కౌశిక్ రెడ్డిని.. కేసీఆర్ హుజూరాబాద్ ప్రజల పైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్ రెడ్డి కూలగొట్టించారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణం” అంటూ ఈటెల జమున ఆరోపించారు.
బీజేపీలో ఈటెల రాజేందర్ సంతృప్తిగా ఉన్నారని.. పార్టీ మారేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టంగా చెప్పారని జమున తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను రావడం లేదని ఆమె స్పష్టం చేశారు.