కెనడాలో ఏపీ యువకుడు మిస్సింగ్!
కెనడాలో ఓ తెలుగు యువకుడు నెల రోజుల కిందట కనిపించకుండాపోయాడు. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో తమ కొడుకుని వెతికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తల్లిదండ్రులు కోరుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే ఏపీలోని సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనకు చెందిన నిడమానూరి శ్రీధర్ నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. కొంతకాలం కిందట అక్కడ ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. ఇటీవల కొన్ని రోజులు ఉండడానికి స్వదేశానికి వచ్చాడు. తరువాత మళ్ళీ తిరిగి ఏప్రిల్ 6న కెనడాకు వెళ్లిపోయాడు. అయితే అలా వెళ్లిన శ్రీధర్ 15 రోజులకు ఏప్రిల్ 21న కెనడాలో కనిపించకుండా పోయాడు. శ్రీధర్ విధులకు హాజరుకాకపోవడం, యజమాని అతడిని రీచ్ కాలేకపోవడంతో.. యజమాని అత్యవసర కాంటాక్ట్కి కాల్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీధర్ అదృశ్యమైన విషయం అతని స్నేహితులు, ఫ్యామిలీకి తెలిసింది.
అప్పటి నుంచి ఆతని గురించి అందరూ వెతుకుతూనే ఉన్నారు. తల్లిదండ్రులు అతని ఆచూకీ తెలిస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నారు.
అయితే ఇప్పటికి నెలరోజులు దాటిన ఇంకా అతని ఆచూకీ తెలియకపోవడంతో శ్రీధర్ తల్లిదండ్రులు తమ కొడుకుని కనిపెట్టి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.